
మన ప్రజాశక్తి ఆలేరు మండలం ఫిబ్రవరి 05.2026
యాదాద్రి భువనగిరి జిల్లా లో ఆరు మున్సిపల్ లకు జరిగే ఎన్నికల్లో సరియైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ఓటర్లకు సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.
గురువారం రోజున ఆలేరు లో సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్,డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్,పార్టీ జిల్లా నాయకులు బేజాడి కుమార్,పోచంపల్లి పట్టణ కార్యదర్శి పగడాల శివ, చౌటుప్పల్ ప్రాంత నాయకుడు కొర్ర సర్వన్ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
పాలక వర్గ పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, బీ.జే.పి, బీ.ఆర్.ఎస్ పార్టీలు గెలుపే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఇస్తూ అనేక ఆశలకు, ప్రలోభాలకు గురి చేస్తూ,విచ్చల విడిగా లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయని,అడ్డదారిలో,అక్రమ పద్ధతుల్లో గెలువడానికి పూనుకుంటాయని ఇలాంటి సమయంలో ఓటర్లు ఆచీ తూచీ అడుగులు వేయాలని, సమర్ధవంతంగా ఇలాంటి పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపు ఇచ్చారు.బీ.జే.పీ కి మతం తప్ప మానవత్వం,మమకారం ఉండదని, ప్రజల ఎజెండా ఆ పార్టీకి అసలే లేదని,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుండి తప్పుదోవ పట్టించేందుకు మతం,మూఢత్వం,భక్తి భావనలను ప్రచారం చేస్తాయే తప్ప ప్రజలకు ఓరుగబెట్టేది ఏమీ ఉండదని అందుకు బీ.జే.పి 12 సంవత్సరాల పాలనే ఋజువుచేస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ 2023 ఎన్నికల్లో చేసిన ప్రధాన హామీలను అమలు చేయలేక చతికిల పడుతుందని అన్నారు.ఇక బీ.ఆర్.ఎస్ పార్టీ ప్రజాధనాన్ని ప్రాజెక్ట్ ల పేరుతో కేసీఆర్ కుటుంబం,కొంత మంది మంత్రులు కోట్ల రూపాయలను కమీషన్ ల పేరుతో పంచుకున్నారని,అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని,అవినీతి డబ్బులు పంచుకోవడంలో గొడవలు వచ్చి పార్టీల ఫిరాయింపులకు కూడా పాల్పడ్డారని అన్నారు.
సరియైన మార్గంలో నడిచే,ప్రజల కోసం ఆలోచించే,ఎలాంటి అవినీతి,అక్రమాలకు పాల్పడనటువంటి నీతి నిజాయితీ కలిగిన,సామాజిక బాధ్యత,ఎలాంటి నేరచరిత్ర లేనటువంటి,ప్రజల అజండాతో ముందుకు వచ్చే అభ్యర్థులను, ప్రజాస్వామిక వాదులను కౌన్సిలర్ లు గా, ఛైర్మెన్ లుగా ఎన్నుకోవాలని కోరారు.

Recent Comments